న్యూఢిల్లీ : ఫస్ట్ డెఫ్ లాయర్ సౌదామిని పీతే ఢిల్లీ బార్ కౌన్సిల్లో తన పేరును నమోదు చేసుకున్నారు. బధిరుల హక్కుల కోసం పోరాడేందుకు, వారికి విద్యా, ఆరోగ్య రంగంలో తగిన సహాయం చేసేందుకు, న్యాయం కోసం పని చేస్తానని సౌదామిని ఈ సందర్భంగా వెల్లడించారు.
45 ఏండ్ల సౌదామిని పీతే ఇండియన్ సైన్ లాంగ్వేజ్ (ISL) ద్వారా కేసులను వాదించనున్నారు. అంతే కాకుండా తన లాంటి వారు తనను ప్రేరణగా తీసుకొని, న్యాయవాద వృత్తిలోకి రావాలని ఆమె ఆకాంక్షించారు. సౌదామిని పీతేకు తొమ్మిదేండ్ల వయసు ఉన్నప్పుడు మెనింజిటిస్ కారణంగా వినికిడి లోపం ఏర్పడింది. చాలా రకాల మందులు వాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
ఈ సందర్భంగా సౌదామిని పీతే మాట్లాడుతూ.. నా లా డిగ్రీని బధిరుల హక్కులు, న్యాయం కోసం ఉపయోగిస్తానని చెప్పారు. తమ కమ్యూనిటీలో విస్తృతమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. లీగల్ రైట్స్ గురించి తెలియజేస్తానని చెప్పారు. న్యాయవాద వృత్తిలో తన లాంటి వారిని చేర్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.