ఇటావా: ఉత్తరప్రదేశ్లోని ఇటావాలో (Etawah) మరో రైలు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున 2.40 గంటలకు జిల్లాలోని ఫ్రెండ్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఢిల్లీ నుంచి సహరసా వెళ్తున్న వైశాలి ఎక్స్ప్రెస్లో (Delhi-Saharasa Vaishali Express) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి (Blaze). దీంతో రైలులోని ఎస్-6 బోగీ పూర్తిగా దగ్ధమయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చెరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారని అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారని, వారిని దవాఖానకు తరలించామని జిల్లా ఎస్పీ సంజయ్ కుమార్ (Sanjai Kumar) తెలిపారు. కాగా, ఈటావా జిల్లాలో పది గంటల వ్యవధిలో ఇది రెండో రైలు ప్రమాదం.
బుధవారం సాయంత్రం 5.30 గంటలకు ఇటావా సమీపంలోని సరయ్ భోపట్ జంక్షన్ వద్ద దర్భంగా ప్రత్యేక ఎక్స్ప్రెస్లో (Darbhanga Special Express) మంటలు చెలరేగాయి. ఎస్-1 కోచ్ నుంచి పొగలు వస్తున్న విషయాన్ని గమనించిన గార్డు రైలును వెంటనే ఆపారు. క్రమంగా మిగిలిన బోగీలకు మంటలు అంటుకోవడంతో మూడు బోగీలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఈ రైలు న్యూఢిల్లీ నుంచి దర్భంగా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నది.