లక్నో: ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘెల్తో పాటు మరికొందరిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నోయిడాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బగేల్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నోయిడాలో ఆదివారం ఇంటింటి ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు. అయితే సీఎం భూపేశ్తోపాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు కరోనా నిబంధనలు ఉల్లంఘించారని గౌతమ్ బుద్ నగర్ పోలీసులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఉత్తరప్రదేశ్లో ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలోని అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని ఎన్నికల సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన కొందరు మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి ఎస్పీలో చేరుతున్నారు.
మరోవైపు తాము కూడా గట్టిపోటీ ఇస్తామని కాంగ్రెస్ అంటోంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, యూపీ ఇంచార్జ్ అయిన ఆమె తనదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.