Punjab minister : పంజాబ్ (Punjab) లో రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్యాలయంలో పనిచేసే సీనియర్ అధికారి గగన్దీప్ సింగ్ రంధావా (Gagandeep Singh Randhawa) ఆత్మహత్య కేసు ఆ రాష్ట్ర మంత్రి లల్జీత్ సింగ్ భుల్లర్ (Laljit Singh Bhullar) మంత్రి పదవిని ఊడగొట్టింది. మంత్రి లల్జీత్ సింగ్ వేధింపుల కారణంగానే ఒత్తిడి తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సదరు అధికారి తన సూసైడ్ నోట్ (Suicide Note) లో పేర్కొన్నాడు. దాంతో ఆయన భార్య ఉపిందర్ కౌర్ (Upinder Kaur) రంజిత్ అవెన్యూ పోలీస్స్టేషన్లో మంత్రిపై ఫిర్యాదు చేసింది. మంత్రి లల్జీత్ సింగ్ భుల్లర్, ఆయన తండ్రి సుఖ్దేవ్ సింగ్ భుల్లర్, మంత్రి పీఏ తన భర్తను శారీరకంగా, మానసికంగా వేధించారని కౌర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆ ముగ్గురు కలిసి వేధింపులతో తన భర్తను ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకెళ్లారని ఆరోపించారు. ఉపిందర్ కౌర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. దాంతో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్.. నిష్పాక్షిక విచారణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేయాలని మంత్రి లల్జీత్సింగ్ను ఆదేశించారు. దాంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. రంధావా ఆత్మహత్య పంజాబ్ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది.
ఈ ఘటనపై ప్రతిపక్షాలైన కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ తీవ్రంగా స్పందించాయి. ఇది ప్రభుత్వ వైఫల్యమని, నిజాయతీపరుడైన అధికారి రాజకీయ వేధింపులకు బలయ్యారని విమర్శించాయి. అయితే ఇవి నిరాధార ఆరోపణలని, రాజకీయ కుట్రలో భాగమని మంత్రి వర్గీయులు ఖండిస్తున్నారు. అధికారి ఆత్మహత్యపై విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని, దోషులు ఎంతటివారైనా చట్టం ముందు నిలబెడతామని సీఎం భగవంత్ మాన్ హామీ ఇచ్చారు.