Ajit Pawar: మహారాష్ట్ర అసెంబ్లీలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి అజిత్ పవార్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలలకు సంబంధించి తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. లోక్సభ ఎన్నికల తర్వాత మరోసారి బడ్జెట్ సమావేశాలు నిర్వహించి మిగతా బడ్జెట్ను ప్రవేశపెడుతామని తెలిపారు.
వచ్చే ఏడాది మార్చికల్లా నవీ ముంబై ఎయిర్పోర్టు అందుబాటులోకి వస్తుందని తన బడ్జెట్ ప్రసంగంలో అజిత్ పవార్ పేర్కొన్నారు. రాష్ట్రం కోసం నూతన MSME పాలసీని రూపొందిస్తున్నామని చెప్పారు. జల్ జీవన్ మిషన్ కింద 1.47 కోట్ల ఇండ్లకు మంచినీటి కనెక్షన్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. అందరికీ ఇండ్లు పథకం కింద దివ్యాంగులకు 34,400 ఇండ్లు సమకూర్చనున్నామని వెల్లడించారు.
అదేవిధంగా ఆయోధ్య, శ్రీనగర్ నగరాల్లో మహారాష్ట్ర భవన్లు నిర్మించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని అజిత్పవార్ చెప్పారు. ఆ రెండు నగరాల్లో భూసేకరణ కోసం రూ.77 కోట్లను కేటాయిస్తున్నామని తెలిపారు. అంతేగాక స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ను నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అదేవిధంగా అహల్యాబాయ్ హోల్కర్, జ్యోతిబాఫూలే, లహూజీ సాల్వే తదితర మహనీయుల స్మారకాలను నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదన చేస్తోందని పవార్ చెప్పారు.