Brij Bhushan | న్యూఢిల్లీ, జూన్ 17: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ను అరెస్టు చేయాలంటూ పోరాటం చేస్తున్న రెజ్లర్లకు మద్దతు పెరుగుతున్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్యలు మద్దతునివ్వగా… తాజాగా దేశంలోని ప్రముఖ పౌరసమాజ సభ్యులు వారికి మద్దతుగా నిలిచారు. బ్రిజ్భూషణ్ను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. రెజ్లర్లకు మద్దతుగా 848 మంది ప్రముఖ పౌరసమాజ సభ్యులు సంతకాలు చేశారు. మాజీ రాయబారి మధు భదూరి, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్కు చెందిన జగదీప్ చోకర్, విద్యావేత్త జోయ హసన్ తదితరులు సంతకాలు చేశారు.
అనర్హత వేటు వేయాలి…
జూన్ 15న ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్లో మైనర్ రెజ్లర్ పోక్సో కేసును రద్దు చేయాలని నివేదికలో పోలీసులు పొందుపరచడాన్ని పౌర సమాజం సభ్యులు తప్పుబట్టారు. బ్రిజ్భూషణ్ను కాపాడేందుకు బీజేపీ ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తున్నదని వారు ఆరోపించారు. బ్రిజ్భూషణ్పై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.
మా పోరాటం రాజకీయ ప్రేరేపితం కాదు
బ్రిజ్పై తాము చేస్తున్న పోరాటం రాజకీయ ప్రేరేపితమైనది కాదని రెజ్లర్ సాక్షిమాలిక్ వెల్లడించారు. ఏండ్లుగా వేధింపులను ఎదుర్కొంటున్నప్పటికీ కుస్తీ సోదరులు ఐక్యంగా లేకపోవడంతో నోరు మెదపలేదని చెప్పారు. ఈ మేరకు సాక్షిమాలిక్, సత్యవర్త్ కడియన్ ఓ వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు. తమ పోరాటాన్ని తప్పుదోవ పట్టించేందుకు వదంతులను సృష్టించి వ్యాప్తి చేస్తున్నారని వారు ఆరోపించారు. బ్రిజ్ను కాపాడేందుకు బీజేపీ యత్నిస్తున్నదని బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ హరిద్వార్లో విమర్శించారు.