Missionaries of Charity | కోల్కతా కేంద్రంగా నడుస్తున్న మిషనరీస్ ఆఫ్ చారిటీ (ఎంవోసీ) సంస్థకు కేంద్రం విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) లైసెన్స్ను కేంద్ర హోంశాఖ పునరుద్ధరించింది. మిషనరీస్ ఆఫ్ చారిటీస్ (ఎంవోసీ)పై కొన్నిఫిర్యాదులు రావడంతో కొన్ని రోజుల క్రితం దానికి ఎఫ్సీఆర్ఏ లైసెన్సు రద్దు చేసింది. ఎంవోసీ ఇక విదేశీ విరాళాలు స్వీకరించొచ్చని, బ్యాంకుల్లో నిధులు ఖర్చు చేసుకోవచ్చునని హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు. నిరుపేదలు, అనాధలను ఆదుకునేందుకు 1950లో ఎంవోసీని స్థాపించిన మదర్ థెరిసాకు నోబెల్ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద విరాళాల స్వీకరణకు లైసెన్స్ పునరుద్ధరణ జరిగిన విషయమై మిషనరీస్ ఆఫ్ చారిటీస్ అధికారికంగా స్పందించలేదు. ఈ నెల ఏడో తేదీన తమ ఎఫ్సీఆర్ఏను కేంద్ర హోంశాఖ పునరుద్ధరించిందని మిషనరీస్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.ఈ పరిణామం పట్ల తాము ఆనందంతో ఉన్నామని తెలిపారు.
తమ ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ పునరుద్ధరించలేదని తెలిసినప్పుడు దేశంలోని విరాళాలు, శ్రేయోభిలాషుల అండదండలతో పేదలు, అనాధలకు సేవలను కొనసాగించాలని నిర్ణయించాం అని మిషనరీస్ అధికారి చెప్పారు. నూతన సంవత్సరం ప్రారంభంలోనే తమ లైసెన్స్ పునరుద్ధరణ రిలీఫ్ కలిగించిందన్నారు. డిసెంబర్ 27న ఎంవోసీ ఎఫ్సీఆర్సీ లైసెన్స్ రద్దు చేసింది కేంద్ర హోంశాఖ. అయితే, ఆ సంస్థ ఖాతాలను ఫ్రీజ్ చేయలేదు. ఎంవోసీ అధికారులే తమ ఎస్బీఐ ఖాతాను ఫ్రీజ్ చేయమని కోరింది.
ఎంవోసీ ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రద్దయిన విషయం బయటికి రావడంతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతోపాటు విపక్ష పార్టీలన్నీ భగ్గుమన్నాయి. మరోవైపు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.. తమ రాష్ట్రంలోని ఎంవోసీ యూనిట్లకు నిధుల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అవసరమైతే సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు వాడుకోవాలని సూచించారు. కొన్ని సంస్థలకు రూ.78 లక్షలకు పైగా నిధులు విడుదల చేశారు.