చెన్నై: తమిళనాడులోని కొట్టకుప్పం పట్టణంలో దీపావళి పూట విషాదం చోటుచేసుకుంది. దీపావళి పండుగ కోసం నాటు పటాకులు కొనుక్కుని, కొడుకుతో కలిసి స్కూటీపై అత్తగారింటికి వెళ్తున్న వ్యక్తి మార్గమధ్యలో విగతజీవిగా మారిపోయాడు. స్కూటీపై సంచిలో ఉన్న నాటు పటాకులు పేలడంతో తండ్రీ కొడుకులు అక్కడికక్కడే మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే.. అరియన్ కుప్పం గ్రామానికి చెందిన కలైనేషన్కు భార్య, ఎనిమిదేండ్ల కొడుకు ప్రదీశ్ ఉన్నారు.
దీపావళి పండుగ నేపథ్యంలో కలైనేషన్ ముందే తన భార్యను విల్లుపురం సమీపంలోని కూనిమేడులోగల పుట్టింటికి పంపించాడు. గురువారం మధ్యాహ్నం తన ఎనిమిదేండ్ల కొడుకుతో కలిసి స్కూటీపై కలైనేషన్ కూడా అత్తగారింటికి బయలుదేరాడు. వెళ్తూవెళ్తూ తన స్వగ్రామం అరియన్ కుప్పంలోనే నాటు పటాసులు కొనుగోలు చేశాడు. ఆ పటాసులను సంచిలో వేసుకుని స్కూటీపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కొట్టకుప్పం పట్టణానికి చేరుకోగానే నడిరోడ్డుపై రన్నింగ్ స్కూటీలోని నాటు పటాకులు పేలి తండ్రీకొడుకులు దుర్మరణం పాలయ్యారు.
ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పండుగ సంబురాలు చేసుకునేందుకు వెళ్తూ తండ్రీకొడుకులు మరణించారని తెలుసుకుని స్థానికులు కంటతడిపెట్టారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, నడి రోడ్డుపై స్కూటీలోని పటాకులు పేలిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.