కోల్కతా: ఈ సోషల్ మీడియా యుగంలో ఏది వైరల్ అవ్వాలన్నా పెద్దగా టైమ్ పట్టదు. ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా కొన్ని ప్రపంచమంతా వైరల్ అవుతుంటాయి. అలా ఓ శ్రీలంక అమ్మాయి పాడిన పాట కూడా ఈ మధ్య ఇంటర్నెట్ను ఊపేస్తున్న విషయం తెలుసు కదా. ఆ పాట పేరు మనికె మాగె హితే ( Manike Mage Hithe ). భాష అర్థం కాకపోయినా.. ఆ అమ్మాయి హస్కీ వాయిస్, ట్యూన్ను ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్ లవర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పాటను ఎంతో మంది తమ స్థానిక భాషలోకి మార్చుకొని పాడారు. తాజాగా బెంగాల్కు చెందిన తండ్రీకూతుళ్లు కూడా ఈ పాటకు బెంగాలీ ట్విస్ట్ ఇచ్చారు. మా మాటి మనుష్ హితే అంటూ లిరిక్స్ను మార్చేసి పాడి.. ఆ పాటను సీఎం మమతా బెనర్జీకి అంకితమిచ్చారు.
సింహళ భాషలో మనికె మాగె హితె అంటే నా గుండెలో అని అర్థం. శ్రీలంక సింగర్ యొహానీ దిలోకా డిసిల్వా ఈ పాట పాడింది. ఈ ఒక్క పాటతో ఆమె రాత్రికి రాత్రి పెద్ద స్టార్ అయిపోయింది. ఇండియాలో అమితాబ్ బచ్చన్, మాధురి దీక్షిత్, టైగర్ ష్రాఫ్లాంటి వాళ్లు కూడా ఈ పాటకు ఫిదా అయిపోయారు. దీంతో ఈ పాటకు బెంగాల్కు చెందిన వ్యాపారవేత్త రాజేష్ చక్రవర్తి, ఆయన కూతురు అపరాజితా కలిసి బెంగాలీ వెర్షన్ను క్రియేట్ చేశారు. మమతా బెనర్జీ నినాదమైన మా మాటి మనుష్ (తల్లి, మాతృభూమి, ప్రజలు) మాటలనే లిరిక్స్గా మార్చి పాడారు. తృణమూల్ ప్రభుత్వ పథకాలతోపాటు మమతా చేసిన పనులన్నింటినీ ఈ పాటలో పొందుపరిచారు. మమతా దేశానికి ప్రధాని కావాలన్న ఆకాంక్షను కూడా ఈ పాట ద్వారా ఈ తండ్రీకూతుళ్లు వ్యక్తం చేశారు.