Article 370 | న్యూఢిల్లీ, డిసెంబర్ 12: ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించడంపై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. ఆయన మంగళవారం ఒక మీడియా సంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నామన్నారు. అయితే దీనిపై తాము మరోసారి కోర్టుకు వెళ్తామని పేర్కొన్న ఆయన.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమని అన్నారు. ‘ఆర్టికల్ 370ని రద్దు చేసేందుకు 70 ఏండ్లు పట్టింది. ఏమో మరో 200 ఏండ్లలో అది మళ్లీ రావొచ్చేమో!’ అని ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.
‘గతంలో ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆర్టికల్ 370ని శాశ్వతంగా పేర్కొన్నది. అయితే అది నేడు నిలబడలేదు కదా! అదేవిధంగా భవిష్యత్తులో ఏం జరుగుతోందో కూడా చెప్పలేం’ అని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు అంశంపై సుప్రీంకోర్టు తీర్పుపై చైనా స్పందించింది. కశ్మీర్ సమస్యను భారత్, పాక్లు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ చెప్పుకొచ్చారు.