లక్ష కాదు.. రెండు లక్షలు కాదు.. ఏకంగా 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అయినా కూడా అతడి ప్రాణం నిలువలేదు. దాదాపు 8 నెలల పాటు కరోనాతో పోరాడి చివరకు ఆ రైతు ఓడిపోయాడు. కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది.
రాష్ట్రంలోని మౌగంజ్ తాలుకా రక్రి గ్రామానికి చెందిన ధరమ్జై సింగ్కు గత సంవత్సరం మే 2న కరోనా సోకింది. దీంతో ఆయన్ను వెంటనే రెవాలో ఉన్న సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ట్రీట్మెంట్ జరుగుతుండగా ఆయన పరిస్థితి విషమించింది. దీంతో ఆయన్ను మే 18న చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన ఊపిరితిత్తులు 100 శాతం డ్యామేజ్ అయిపోయాయి. దీంతో సింగ్ను డాక్టర్లు Extracorporeal membrane oxygenation (ECMO) మీద ఉంచారు.
దేశంలోనే పేరుమోసిన డాక్టర్లు ఆయనకు ట్రీట్మెంట్ చేశారు. లండన్ నుంచి సింగ్ కోసం ప్రత్యేకంగా డాక్టర్ను పిలిపించారు. అయినప్పటికీ.. 8 నెలల పాటు కరోనాతో పోరాడి చివరకు అపోలో ఆసుపత్రిలో సింగ్ కన్నుమూశాడు. 8 నెలల పాటు లైఫ్ సపోర్ట్ మీదనే సింగ్ శ్వాస తీసుకున్నాడు. దాదాపు 8 నెలల పాటు కరోనా ట్రీట్మెంట్ తీసుకున్న తొలి వ్యక్తి సింగే కావడం గమనార్హం. సింగ్ కంటే ముందు మీరట్కు చెందిన విశ్వాస్ షైనీ 130 రోజుల పాటు కోవిడ్ చికిత్స తీసుకున్నాడు.
దాదాపు 8 నెలల పాటు సింగ్ వైద్యఖర్చుల కోసం ఆయన కుటుంబ సభ్యులు తమకున్న 50 ఎకరాల వ్యవసాయ భూమిని అమ్మి 8 కోట్లు ఖర్చు పెట్టారు. ఆసుపత్రిలో ఒక రోజుకు రూ.3 లక్షలు చెల్లించారు. అంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా సింగ్ను మాత్రం ప్రాణాలతో కాపాడుకోలేకపోయామని కుటుంబ సభ్యులు వాపోయారు.
అయితే.. మధ్యప్రదేశ్లో స్ట్రాబెర్రీ, గులాబీల సాగులో సరికొత్త విధానాన్ని అవలంభించి.. సింగ్ రికార్డు క్రియేట్ చేశాడు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తనను సత్కరించారు కూడా. తను కరోనా బారిన పడ్డాడని తెలుసుకున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం.. తమ వంతుగా రూ.4 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది.