లక్నో: వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందితే గృహ వినియోగదారులకు 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా సరఫరా చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించింది. దీంతోపాటు 38 లక్షల కుటుంబాలకు విద్యుత్ బిల్లుల బకాయిలు మాఫీ చేస్తామని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
యూపీలో అధిక విద్యుత్ చార్జీలు వసూలు చేస్తున్నారని సిసోడియా మండిపడ్డారు. వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుందని హామీ ఇచ్చారు. తమ పార్టీ అధికారం చేపట్టిన తొలి రోజే ఉచిత విద్యుత్ హామీ నెరవేరుస్తామని తెలిపారు. అధిక విద్యుత్ బిల్లులతో అలీగఢ్లో రామ్ జీ లాల్ అనే రైతు ఆత్మహత్య చేసుకున్న సంగతి గుర్తు చేశారు. యూపీలో విద్యుత్ బిల్లులు చెల్లించడం పేదలకు కష్టంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.