న్యూఢిల్లీ: భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ‘అత్యంత అప్రమత్తంగా ఉండండి’ (Exercise utmost caution) అని కెనడాలోని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. కెనడాలోని ఖలిస్థాన్ అనుకూల అంశాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలన్న భారత్ పిలుపు పట్ల ఆ దేశ ప్రభుత్వం ఉదాసీనత కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించినట్లు తెలిపింది. దీంతో కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు, రాజకీయ ప్రేరేపిత, ద్వేషపూరిత నేరాలు, హింస పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. భారత వ్యతిరేక ఎజెండాను వ్యతిరేకించే భారత పౌరులకు బెదిరింపులు వస్తున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో కెనడాలోని భారత పౌరులు, విద్యార్థులు, ఆ దేశానికి వెళ్లాలనుకునే భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో కెనడాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని భారత పౌరులను కోరింది. ఈ మేరకు బుధవారం సూచనలు జారీ చేసింది. ఒట్టావాలోని భారత హైకమిషన్ వెబ్సైట్ ప్రకారం కెనడాలో 2,30,000 మంది భారతీయ విద్యార్థులు, 7,00,000 మంది ప్రవాస భారతీయులు ఉన్నట్లు అంచనా.
కాగా, జూన్లో కెనడా భూభాగంలో జరిగిన ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు భారత ప్రభుత్వంతో సంబంధం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో సోమవారం హౌస్ ఆఫ్ కామన్స్లో ఆరోపించారు. హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు భారత ప్రభుత్వ ఏజెంట్లతో సంబంధం ఉందన్న దానికి నమ్మదగిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. భారత్ను రెచ్చగొట్టడం లేదన్న ఆయన, నిజ్జర్ హత్యను అత్యంత తీవ్రంగా పరిగణించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు.
మరోవైపు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యల నేపథ్యంలో ఇరు దేశాలు తమ తమ దౌత్య అధికారులను బహిష్కరించాయి. అలాగే కెనడా ఆరోపణలను భారత్ ఖండించింది. ఇవి కల్పితం, విడ్డూరమని విమర్శించింది. ఈ నేపథ్యంలో భారత్, కెనడా సంబంధాలపై చర్చించేందుకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రధాని మోదీని కొత్త పార్లమెంట్ హౌస్లో బుధవారం కలిశారు.