జైపూర్: అత్యధిక కాలం పింఛన్ తీసుకున్న వ్యక్తిగా రికార్డుల్లో నిలిచిన బోయత్రామ్ దుడి కన్నుమూశారు. ఎక్స్ సర్వీస్ మెన్ అయిన రాజస్థాన్లోని ఝున్ఝునుకు చెందిన బోయత్రామ్ (100) సోమవారం కన్నుమూశారు. స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ ఇండియా సైన్యంలో పనిచేసిన ఆయన.. 66 ఏండ్లకు పైగా పెన్షన్ అందుకున్నారు. బోయత్రామ్ తన 17 ఏండ్ల వయస్సులో ఆర్మీలో జాయిన్ అయ్యారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో లిబియా, ఆఫ్రికాలో పనిచేశారు.
కాగా, భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన పదేండ్లకు అంటే 1957లో ఆయన ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు. దీంతో అప్పటి నుంచి ప్రతినెల పెన్షన్ అందుకుంటున్నారు. 1957లో రూ.19 తో ప్రారంభమైన పింఛన్.. ఆయన మరణించేనాటికి రూ.35,640కి చేరింది. ఇప్పుడు ఆయన సతీమణి చందా దేవి సైనా (92) తాను బతికున్నంత కాలం పెన్షన్ అందుకోనున్నారు.