న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం)లు భారత్కు గర్వకారణమని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) సుశీల్ చంద్ర తెలిపారు. వాటిని ట్యాంపరింగ్ చేయడం లేదా హ్యాక్ చేయడం సాధ్యం కాదన్నారు. ఢిల్లీలోని బక్తావర్పూర్లో ఇంటిగ్రేటెడ్ ఎలక్షన్ కాంప్లెక్స్ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సుశీల్ చంద్ర మాట్లాడారు. ఇప్పటి వరకు నాలుగు పార్లమెంట్, ఇతర అసెంబ్లీ ఎన్నికల్లో 320 కోట్ల ఓటర్లు ఈవీఎంల ద్వారా ఓటు వేశారని తెలిపారు. దీని ఖచ్చితత్వానికి ఇదే నిదర్శనమని చెప్పారు. అందుకే ఈవీఎంలు దేశానికి ఎంతో గర్వకారణమని, ఇది ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని అన్నారు.
ఈవీఎం అనేది సింగిల్ చిప్ ప్రోగ్రామ్ అని సుశీల్ చంద్ర తెలిపారు. దీనిని ట్యాంపరింగ్ చేయలేరని, హ్యాకింగ్ ప్రశ్నే తలెత్తదని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో VVPAT ఆడిట్ ట్రయల్ కూడా ఉంటుందన్నారు. దీంతో ఈవీఎంలు ఖచ్చితమైన ఫలితాలను ఇస్తాయని వివరించారు. చాలా తక్కువ సమయంలో వేగంగా, ఖచ్చితమైన ఎన్నికల ఫలితాలు భారత్లో ఎలా సాధ్యం అని పలు దేశాలు ఆశ్చర్యపోతున్నాయని అన్నారు.
కాగా, గత ఎన్నికల్లో ఢిల్లీలో ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదైందని సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు. దేశ రాజధానిలో విద్యావంతులైన జనాభా ఉన్నప్పటికీ పోలింగ్ శాతం ఎందుకు తక్కువగా ఉంది? అని ప్రశ్నించారు. దక్షిణ ఢిల్లీలో కనీస ఓటింగ్ శాతం మాత్రమే నమోదైందని చెప్పారు. అస్సాంలో 80 శాతంపైగా ఓటింగ్ ఉంటే ఢిల్లీలో 62.5 శాతం ఎందుకు వచ్చిందో అన్నది పరిశీలన చేయాల్సి ఉందన్నారు. ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.