న్యూఢిల్లీ: భారత కుస్తీ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్పై ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మహిళా రెజ్లర్లు చేసిన తీవ్రమైన ఆరోపణలను పరిశీలిస్తామని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అన్న నేపథ్యంలో పోలీసులు ఎట్టకేలకు స్పందించారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టులో శుక్రవారం కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ బ్రిజ్భూషణ్పై 40 కేసులు నమోదయ్యాయని తెలిపారు. యూపీ గ్యాంగ్స్టర్ చట్టం-1993 ప్రకారం బ్రిజ్భూషణ్పై నాలుగుసార్లు కేసు నమోదైందని వెల్లడించారు. మరోవైపు, బ్రిజ్భూషణ్ను అరెస్ట్ చేసే వరకు తమ ధర్నా కొనసాగిస్తామని రెజ్లర్లు స్పష్టం చేశారు. బ్రిజ్భూషణ్ లాంటి వారికి శిక్ష పడాలన్నదే తమ అభిమతమన్నారు. తాను నిస్సహాయుడిగా మారిన రోజు మరణానికైనా సిద్ధమని బ్రిజ్ భూషణ్ ఒక వీడియో విడుదల చేశారు. కాగా, విచారణ కమిటీ ఇచ్చిన నివేదికపై కేంద్రం ఇప్పటిదాకా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రెజ్లర్లకు న్యాయం జరగాలి
ఒలింపిక్ చాంపియన్లు మన దేశానికి ఖ్యాతి తీసుకొస్తే సంబురాలు చేసుకున్నాం. ఇప్పుడు వాళ్లు న్యాయం కోసం పోరాడుతున్నారు. మనం మద్దతుగా నిలబడాలి. రెజ్లింగ్ సమాఖ్య చీఫ్పై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణ జరగాలి. రెజ్లర్లకు న్యాయం జరగాలి. వారి ధర్నాకు నా మద్దతు.
– మంత్రి కేటీఆర్
సమస్యలు పరిష్కరించాలి
అంతర్జాతీయంగా అత్యంత ప్రతిభగల అథ్లెట్లకు భారత్ నిలయం. అనేక మంది మన అథ్లెట్లు ప్రపంచస్థాయి గుర్తింపు పొందారు. అందులో ప్రతి ఒక్కరూ తమ క్రీడాప్రయాణం ద్వారా మనకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మన అథ్లెట్ల సమస్యలను విని దేశ ప్రయోజనాల దృష్ట్యా పరిష్కారం చూపించాలి
-ఎమ్మెల్సీ కవిత