న్యూఢిల్లీ: పార్లమెంట్లో స్మోక్ అటాక్(Smoke Attack)కు పాల్పడిన ఆ వ్యక్తుల గురించి తెలుసుకుందాం. ఆ నలుగూరు వేర్వేరు బ్యాక్గ్రౌండ్కు చెందినవాళ్లు. వాళ్ల విద్యార్హతలు కూడా వేరే. ప్రాంతాలు కూడా వేరే. 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వాళ్లు. పొగ క్యాన్లతో అటాక్ చేసిన సాగర్ శర్మ, నీలమ్ ఆజాద్, మనోరంజన్ డీ, అమోల్ షిండే, విక్కీ శర్మ, లలిత్ జా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. వీళ్లంతా భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్కు చెందినట్లు గుర్తించారు. నీలమ్ ఆజాద్, అమోల్ షిండేలు.. తమకు కావాల్సిన ఉద్యోగాలు రాబట్టడంలో విఫలం అయ్యారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మణిపూర్ హింస గురించి హైలెట్ చేసేందుకు స్మోక్ అటాక్ చేసినట్లు చెబుతున్నారు.
రిక్షా డ్రైవర్..
లోక్సభ విజిటర్స్ గ్యాలరీలో తొలుత స్మోక్ క్యాన్తో దూకిన వ్యక్తిని 27 ఏళ్ల సాగర్ శర్మగా గుర్తించారు. అతను ఢిల్లీలో జన్మించాడు. లక్నోలో పెరిగాడు. అతను తన సోషల్ మీడియాలో భగత్ సింగ్,చెగువీరా గురించి పోస్టులు చేస్తుంటాడు. స్పీకర్ చైర్ దిశగా తన చేతుల్లో స్మోక్ క్యాన్తో అతను దూసుకెళ్లిన విషయం తెలిసిందే. సాగర్ శర్మను కొందరు ఎంపీలు పట్టుకుని, దేహశుద్ది చేశారు. ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తున్నట్లు అతను ఇంట్లో చెప్పి వెళ్లినట్లు సమాచారం. శర్మ ఈ-రిక్షా డ్రైవర్గా చేస్తున్నాడు.
ఇంజినీర్..
మనోరంజన్ది మైసూరు. కంప్యూటర్ ఇంజినీరింగ్లో అతను డిగ్రీ చేశాడు. 34 ఏళ్ల అతని వద్ద విజిటర్స్ గ్యాలరీ పాస్ ఉంది. శర్మ తర్వాత లోక్సభ ఛాంబర్లోకి అతను దూకాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత అతను జాబ్ చేశాడా లేదా అన్న విషయం తెలియదు. తన కుమారుడు అలా చేసి ఉండడని తండ్రి దేవరాజ్ గౌడ తెలిపారు. ఒకవేళ అతను అలా చేస్తే అతన్ని ఉరి తీయాలన్నాడు. మనోరంజన్, శర్మ వద్ద ఉన్న పాస్లు.. మైసూరుకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా పేరుమీద ఉన్నాయి.
టీచర్..
నీలమ్ ఆజాద్ది హర్యానాలోని హిస్సార్. ఆమెకు ఎంఫిల్ డిగ్రీ ఉంది. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు కూడా ఆమె పాసైంది. పార్లమెంట్ ఆవరణలో రంగుల స్మోక్ క్యాన్లతో నిరసన చేపట్టిన వ్యక్తుల్లో ఆమె ఒకరు. ఆమె వయసు 37 ఏళ్లు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు. రెజ్లర్ల నిరసన సమయంలోనూ ఆమె కనిపించారు. ఉన్నత విద్యను ఆర్జించినా.. ఆమెకు ఉద్యోగం దక్కలేదు.
ఆర్మీ ఔత్సాహికుడు..
అమోల్ షిండే ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి. పార్లమెంట్ ఆవరణలో నీలమ్తో కలిసి అమోల్ నిరసనలో పాల్గొన్నాడు. మహారాష్ట్రలోని లాతూరు గ్రామం అతనిది. 25 ఏళ్ల అతను అనేక పోలీసు, ఆర్మీ పరీక్షల్లో విఫలం అయ్యాడు. పోలీసు రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం వెళ్తున్నట్లు డిసెంబర్ 9వ తేదీన అతను ఇంట్లో చెప్పి వెళ్లాడు. కొడుకు ఏం చేశాడన్న విషయంపై తమకు ఏమీ తెలియదని అతని పేరెంట్స్ తెలిపారు. షిండే, మనోరంజన్, శర్మ, నీలమ్ను అరెస్టు చేశారు.