Floods : జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) లో భారీ వర్షాలు (Heavy Rains), వరదలు (Floods) బీభత్సం సృష్టించాయి. ఎడతెగని వర్షాలవల్ల రాజౌరీ, పూంచ్ (Rajouri, Poonch) జిల్లాల్లో మెరుపు వరదలు సంభవించాయి. రాజౌరీలో నదులు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. కొత్త బస్టాండ్ పూర్తిగా నీట మునిగింది. ఈ వరదలవల్ల 11 మంది మృతిచెందారు. పలువురు గల్లంతయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
శనివారం సాయంత్రం నుంచి కురిసిన భారీ వర్షాలకు ఆదివారం వరదలు పోటెత్తాయి. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా మరో ఐదుగురు గల్లంతయ్యారు. మృతుల్లో భారీ వర్షాల కారణంగా పూంచ్ జిల్లాలో ఇల్లు కూలి ముగ్గురు మరణించగా రాజౌరిలో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, భారీ వర్షాలతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు గల్లంతైన ఐదుగురి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
వందలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాజౌరి జిల్లాలోని దర్హాలి, ఖండ్లీ, సుక్తోహ్, జమోలా నదులతో సహా అన్ని ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వాటిలో చాలా వరకు ప్రమాదకర స్థాయికి చేరి అనేక లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ముఖ్యంగా రాజౌరి పట్టణాన్ని వరదనీరు ముంచెత్తింది. దర్హాలి నదికి వరద పోటెత్తగా బేలా కాలనీ సమీపంలోని రక్షణ గోడ కూలిపోయింది. దాంతో కొత్త బస్టాండ్ ఆవరణలోకి వరద నీరు దూసుకొచ్చి డజన్ల కొద్దీ వాహనాలు కొట్టుకుపోయాయి.
అబ్దుల్లా వంతెన సమీపంలోని మురికివాడ కూడా తీవ్రంగా దెబ్బతింది. ఆ ప్రాంతంలోకి వరదనీరు ప్రవేశించడంతో 50 కిపైగా కుటుంబాలను అధికారులు ఖాళీ చేయించారు. తారిఖ్ వంతెన సమీప ప్రాంతాన్నీ వరద నీరు ముంచెత్తింది. దాంతో పోలీసులు, అత్యవసర సిబ్బంది స్థానికులను నదీ తీర ప్రాంతానికి దూరంగా తరలించారు. అలాగే నదీ తీరం, లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు సూచించారు. కాగా జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా జూలై 23 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. గత 24 గంటల్లో రియాసిలో అత్యధికంగా 106 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజౌరిలో 103 మిల్లీమీటర్లు, ఉధంపూర్లో 101.6 మిల్లీమీటర్లు, కత్రాలో 85 మిల్లీమీటర్లు, పూంచ్లో 77 మిల్లీమీటర్లు, బటోటేలో 57.5 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది.