న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పేరుకుపోతున్న చెత్త దిబ్బల వద్ద వీడియో తీస్తే ఇకపై ఛార్జీ వసూలు చేస్తారు. తూర్పు ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (EDMC) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. ఈ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడైనా చెత్త దిబ్బల వద్ద చిత్రీకరణ, వెబ్ సిరీస్ షూటింగ్ కోసం ప్రతిరోజూ రూ.75,000 చెల్లించాలని మేయర్ శ్యామ్ సుందర్ అగర్వాల్ తెలిపారు. ల్యాండ్ఫిల్ సైట్ సమీపంలో షూటింగ్ కోసం రూ. 2 లక్షలు వసూలు చేస్తామని చెప్పారు. సెక్యూరిటీ డిపాజిట్గా రూ.25,000 చెల్లించాలని, 2 వారాల్లో దానిని తిరిగి ఇస్తామని అన్నారు.
అయితే, ఎవరైనా చెత్త తొలగింపు సమస్యపై డాక్యుమెంటరీ తీయాలనుకున్నా లేదా సామాజిక సందేశాన్ని అందించడానికి షూటింగ్ కోసం తమకు దరఖాస్తు చేస్తే వారి నుండి ఏమీ వసూలు చేయబోమని తూర్పు ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ శ్యామ్ సుందర్ అగర్వాల్ వివరించారు. ఈ మేరకు కార్పొరేషన్ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.