న్యూఢిల్లీ, ఆగస్టు 3: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆ పత్రిక కార్యాలయంలో ఉన్న యంగ్ ఇండియా ఆఫీస్ను కూడా సీల్ చేసింది. తమ అనుమతి లేకుండా ఆ కార్యాలయాన్ని ఎవరూ తెరవకూడదని స్పష్టంచేసింది. మంగళవారం జరిపిన సోదాల సమయంలో యంగ్ ఇండియా కార్యాలయంలో అధికారులెవరూ అందుబాటులో లేరని, ఆ ఆఫీస్లోని సాక్ష్యాలను భద్రపర్చేందుకే తాత్కాలికంగా ఆఫీస్కు సీల్ వేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. బహదూర్ షా జాఫర్ రోడ్డులోని నేషనల్ హెరాల్డ్ కార్యాలయంలో యంగ్ ఇండియా ఆఫీస్కు మాత్రమే సీల్ వేశామని చెప్పారు. ఈడీ సీల్ వేసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లే దారులన్నింటినీ ఢిల్లీ పోలీసులు మూసివేశారు. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా, రాహుల్గాంధీ నివాసాల చుట్టూ బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఈడీ చర్యపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. కాంగ్రెస్ పార్టీపై నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రత్యక్ష దాడి మొదలుపెట్టిందని ఆ పార్టీ నేతలు జైరాం రమేశ్, అజయ్మాకెన్ విమర్శించారు. తమ పార్టీ అగ్రనేతలను ఉగ్రవాదుల్లో నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.