చెన్నై: క్యాష్ ఫర్ జాబ్ కేసులో అరెస్టయిన తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని కస్టడీలోకి తీసుకునే హక్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కు ఉన్నదని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ సీవీ కార్తికేయన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. తన భర్తను ఈడీ కస్టడీలోకి తీసుకోవడం అక్రమం అంటూ సెంథిల్ బాలాజీ భార్య మేఘల వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది.
కాగా, క్యాష్ ఫర్ జాబ్ కేసులో ఆరోపణలు రావడంతో ఈడీ గత నెల 14న సెంథిల్ బాలాజీని అరెస్ట్ చేసింది. అయితే ఆ తర్వాత ఆయన ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించింది. చికిత్స అనంతరం కోర్టులో హాజరుపర్చి జైలుకు పంపింది. ఈ క్రమంలో నిందితుడి భార్య వేసిన పిటిషన్పై తాజాగా విచారణ జరిపిన హైకోర్టు.. సెంథిల్ బాలాజీ ఆస్పత్రిలో ఉన్న సమయాన్ని కస్టడీ పీరియడ్ నుంచి మినహాయించాలని పేర్కొన్నది. నిందితుడి అరెస్ట్ లీగల్ అయినప్పుడు అతని రిమాండ్ కూడా లీగలే అవుతుందని వ్యాఖ్యానించింది.