జైపూర్: దేశంలో వింత సంఘటనలు జరుగుతున్నాయని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. ఇళ్లలోకి ప్రవేశించిన ఈడీ, సీబీఐ అధికారులు ఏడు రోజులైనా బయటకు వెళ్లడం లేదని విమర్శించారు. దీనిపై దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దీనిని బలంగా వ్యతిరేకిస్తారని చెప్పారు. అందుకే ప్రజలు కాంగ్రెస్ను నమ్ముతారని ఆయన అన్నారు. ఉదయ్పూర్లో జరుగనున్న కాంగ్రెస్ మేథోమధనం సదస్సు ఏర్పాట్లను సీఎం అశోక్ గెహ్లాట్ గురువారం పరిశీలించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.
దేశం క్లిష్ట కాలంలో ఉన్నదని సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు. అందుకే ‘నవ్ సంకల్ప్ శివిర్’ సాధారణమైనది కాదన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, బియాంత్ సింగ్ వంటి వారు వీరమరణం పొందారని గుర్తు చేశారు. అయితే ఈ రోజు అధికారంలో ఉన్నవారు గత 70 ఏళ్లలో ఏమి జరిగిందని అడుగుతున్నారంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ రహిత భారత్ గురించి మాట్లాడే వారికే త్వరలో విముక్తి లభిస్తుందన్నారు.