మద్రాస్ హైకోర్టు హెచ్చరికల నేపథ్యంలో నిర్ణయం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: దేశంలో కరోనా కేసులు ఉద్ధృతమవుతున్న వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకున్నది. మే 2న నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే రోజు, అనంతరం జరిగే అన్ని విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించింది. గెలుపొందిన వారు రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువపత్రాన్ని తీసుకునే సమయంలో ఇద్దరు మాత్రమే వెంట ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ఫలితాలనాడు కొవిడ్-19 నిబంధనలు పాటించకుంటే కౌంటింగ్ రద్దు చేస్తామని సోమవారం మద్రాస్ హైకోర్టు హెచ్చరించిన నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నది. కొవిడ్ నిబంధనలను అమలు చేయాల్సిన బాధ్యత రాష్ర్టాలదని ఈసీ ఈ సందర్భంగా పేర్కొన్నది.