షిల్లాంగ్ : గోవధకు బీజేపీ వ్యతిరేకం కాదన్న భావనను తొలగించేందుకు కృషి చేస్తున్నానని మేఘాలయ మంత్రి సనోబర్ షుల్లాయి పేర్కొన్నారు. గత వారం మంత్రిగా ప్రమాణం చేసిన సనోబర్.. గొడ్డు మాంసం తినాలని మేఘాలయ ప్రజలకు పిలుపునిచ్చారు. చికెన్, మటన్, చేపల కంటే అధికంగా గొడ్డు మాంసం ప్రజలు తినేందుకు ప్రోత్సహిస్తానని ఆయన స్పష్టం చేశారు. దీంతో బీజేపీ గోవధపై నిషేధం విధిస్తుందనే భావన తొలగిపోతుంది అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరికీ నచ్చిన ఆహారం వారు తినొచ్చు అని చెప్పారు. అసోం ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త ఆవు చట్టంతో మేఘాలయకు పశువుల రవాణా చేసే విషయంలో ఎలాంటి ప్రభావం చూపకుండా.. ఆ రాష్ర్ట సీఎం హిమంత బిశ్వా శర్మతో మాట్లాడుతానని మంత్రి సనోబర్ తెలిపారు.
సరిహద్దులో మన రాష్ర్ట ప్రజలకు అసోం వాసులు వేధిస్తే మనం కూడా కచ్చితంగా స్పందించాలన్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. అయితే తాను హింసను ప్రోత్సహించను అని మంత్రి పేర్కొన్నారు. మన ప్రజల్ని రక్షించుకునేందుకు పోలీసులు ముందుండి అసోం పోలీసులతో చర్చలు జరపాలన్నారు. అయితే మిజోరం – అసోం సరిహద్దు విషయంలో మిజోరం పోలీసులు తమ ప్రాంత ప్రజలను రక్షించుకునేందుకు ముందు వరుసలో ఉన్నారని మంత్రి సనోబర్ ప్రశంసించారు. సరిహద్దులో మేఘాలయ ప్రజలను రక్షించుకునేందుకు మన పోలీసులు వెనుకంజలోనే ఉన్నారని విమర్శించారు. కానీ ఇప్పుడు సమయానికి అనుగుణంగా పోలీసులు వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడు ఒక వేళ శత్రువులు మన ఇంటికి వస్తే.. వారు మన కుటుంబంపై దాడి చేస్తారు. అదే సమయంలో ఆత్మరక్షణ కోసం మనం కూడా శత్రువులతో పోరాటం చేయాలి. ఈ విధంగానే సరిహద్దులో కూడా పోరాటం చేయాలని మంత్రి సనోబర్ సూచించారు.