న్యూఢిల్లీ : ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని డిపార్చర్ గేటు వద్ద ఓ వ్యక్తి తాగిన మైకంలో బహిరంగంగా మూత్ర విసర్జన చేసిన ఘటన వెలుగుచూసింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో మహిళపై ముంబైకి చెందిన ఓ వ్యాపారి మద్యం మత్తులో మూత్రం పోసిన ఘటన కలకలం రేపిన క్రమంలో తాజా ఘటన చోటుచేసుకుంది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రమయం టెర్మినల్ 3 డిపార్చర్ గేటు నెంబర్ 6 వద్ద మూత్రం పోస్తుండగా జుహర్ అలీ ఖాన్ అనే వ్యక్తిని విమానాశ్రయ సిబ్బంది పట్టుకున్నారు.
సదరు వ్యక్తి ఇతర ప్యాసింజర్ల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడని తెలిసింది. జనవరి 8న ఈ ఘటన జరగ్గా అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు బెయిల్పై విడుదల చేశారు. కాగా మహిళపై ఎయిర్ ఇండియా విమానంలో మూత్రం పోసిన ముంబైకి చెందిన వ్యాపారి శంకర్ మిశ్రాను అరెస్ట్ చేసి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఘటనపై తమకు సమాచారం ఇవ్వనందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిర్ ఇండియాను మందలించింది.
ఎయిర్ ఇండియాతో పాటు సంస్ధ ఇన్ఫ్లైట్ సేవల డైరెక్టర్, విమాన సిబ్బందికి డీజీసీఏ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఈ ఘటన జరిగిన తర్వాత బాధిత మహిళకు వేరే సీటు ఇచ్చేందుకు రెండు గంటలు జాప్యం చేశారని ఆమె పక్క సీటులో కూర్చున్న ప్రయాణీకుడు వివరించారు. కాగా, నిందితుడిని 30 రోజుల పాటు తమ విమానాల్లో ప్రయాణించకుండా ఎయిర్ ఇండియా నిషేధించింది.