బెంగళూరు: పలు సర్జరీలు చేయాల్సిన డాక్టర్ మద్యం మత్తులో (Drunk doctor) ఆపరేషన్ థియేటర్లో పడిపోయాడు. అక్కడి నేలపై నిద్రపోయాడు. దీంతో శస్త్రచికిత్సలకు సిద్ధమైన వారు ఇబ్బందులకు గురయ్యారు. కర్ణాటకలోని చిక్మగళూరులో ఈ సంఘటన జరిగింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పలువురు మహిళలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ మహిళలకు ఉదయం 8 గంటలకే అనస్థీషియా ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే ఆపరేషన్ల కోసం అంతా సిద్ధం చేశారు. అయితే సర్జరీలు చేయాల్సిన డాక్టర్ బాలకృష్ణ మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు. ఆ తర్వాత మహిళలకు శస్త్రచికిత్సలకు ముందు మద్యం మత్తులో ఆపరేషన్ థియేటర్లో పడిపోయాడు. అనంతరం అక్కడి నేలపై నిద్రపోయాడు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న మహిళల బంధువులు ఆందోళనకు దిగారు. ఆ డాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు డాక్టర్ బాలకృష్ణ చాలాసార్లు ఇలాంటి తప్పులు చేసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గతంలో కూడా ఆయన మద్యం సేవించి విధులకు హాజరై పట్టుబడినట్లు చెప్పారు. తాజా సంఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.