న్యూఢిల్లీ, జూన్ 12: డ్రైవింగ్ లైసెన్స్ను తీసుకోవాలంటే ఆర్టీవో (రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్)కు వెళ్లటం, డ్రైవింగ్ టెస్టు పాస్ అవటం వంటి ప్రస్తుత పరిస్థితి మరికొన్ని రోజుల్లో ఉండకపోవచ్చు. మీకు దగ్గర్లో ఉన్న డ్రైవింగ్ శిక్షణ కేంద్రంలో, మీకు నచ్చిన సమయంలో లైసెన్స్ తీసుకోవచ్చు. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఇటీవల ఒక కొత్త నిబంధనను ప్రకటించింది. దీనిప్రకారం.. నిర్ణీత ప్రమాణాలను పాటించే డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకు ప్రభుత్వ గుర్తింపును ఇవ్వనున్నారు. డ్రైవింగ్లో అక్కడ శిక్షణ తీసుకొని, టెస్టులో పాస్ అయితే అక్కడికక్కడే ఒక ధ్రువీకరణపత్రం ఇస్తారు. అది ఆర్టీవో ఆఫీస్కు ఆన్లైన్లో వెళ్తుంది. దానిని నిర్ధారిస్తూ వాళ్లు లైసెన్స్ జారీ చేస్తారు. అది పోస్టులో ఇంటికొస్తుంది. ‘ఈ మొత్తం ప్రక్రియ మానవ ప్రమేయం లేకుండా టెక్నాలజీ ఆధారితంగా నడుస్తుంది. తగిన ఖాళీస్థలం, డ్రైవింగ్ట్రాక్, ఐటీ అండ్ బయోమెట్రిక్ సిస్టమ్ ఉన్న కేంద్రాలకు ప్రభుత్వం గుర్తింపును ఇస్తుంది. జూలై నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానున్నట్లు తెలిపారు.