లక్నో: శత్రు దేశాలకు చుక్కలు చూపించే డ్రోన్ దండును రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ప్రదర్శించింది. దేశ వ్యాప్తంగా ఏడాది పాటు నిర్వహిస్తున్న 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా భారత శక్తి సామర్థ్యాలను చాటింది. ఉత్తర ప్రదేశ్ ఝాన్సీలో మూడు రోజుల పాటు రక్షణ సంబంధ కార్యక్రమాలు జరుగనున్నాయి.
ఇందులో భాగంగా బుధవారం కార్యక్రమం ప్రారంభం నేపథ్యంలో శత్రు భూభాగంలో ప్రమాదకర మిషన్లను నిర్వహించగల స్వదేశీ సామర్థ్యాన్ని డీఆర్డీవో ప్రదర్శించింది. లక్ష్యాల గుర్తింపు, చుట్టుముట్టడం, దాడులను తిప్పికొట్టే చర్యలను డ్రోన్ల సమూహం నిర్వహించింది. సైనికులకు ఎలాంటి హానీ కలగకుండా కీలకమైన సైనిక అవసరాలను ఈ డ్రోన్ల దండు తీరుస్తుందని డీఆర్డీవో అధికారులు తెలిపారు.
కాగా, ఆయుధాలు, డ్రగ్స్ అక్రమ రవాణాతోపాటు దాడులకు పాక్ ఉగ్రవాదులు ఇటీవల డ్రోన్లను విరివిగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 15న ఆర్మీ డే పరేడ్లో తొలిసారి డ్రోన్ సమూహ సాంకేతికను ఆర్మీ ప్రదర్శించింది. దేశీయంగా రూపొందించి అభివృద్ధి చేసిన 75 డ్రోన్లు నింగిలో సందడి చేశాయి. అనేక సైనిక విన్యాసాలు నిర్వహించాయి.
మరోవైపు డ్రోన్ దండుతో.. ట్యాంకులు, పదాతిదళ పోరాట వాహనాలు, మందుగుండు సామగ్రిని కలిగి ఉన్న ప్రాంతాలు, ఇంధన డంప్లు, టెర్రర్ లాంచ్ ప్యాడ్లపై దాడులు నిర్వహించి వాటిని నాశనం చేయవచ్చని, అనేక రకాల సైనిక మిషన్లను నిర్వహించవచ్చని డీఆర్డీవో అధికారులు వెల్లడించారు.