న్యూఢిల్లీ: అభివృద్ధి అడ్డుపడే బీజేపీకి ఓటు వేయొద్దని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో కేజ్రివాల్ ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఢిల్లీలో తాము చేపట్టిన ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమానికి బీజేపీ అడ్డుతగిలిందని మండిపడ్డారు.
పహర్గంజ్ సభలో కేజ్రివాల్ ప్రసంగిస్తూ.. తాము ఢిల్లీలో పాఠశాలలను, ఆస్పత్రులను అభివృద్ధి చేశామని చెప్పారు. అయితే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తమ చేతిలో లేకపోవడంవల్ల పారిశుద్ధ్య పనులను మెరుగుపర్చలేకపోయామన్నారు. గత 15 ఏండ్లుగా మున్సిపాలిటీని ఏలుతున్న బీజేపీ నాలుగోసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.
బీజేపీ గెలిస్తే ఢిల్లీని మరింత మురికిగా మార్చడం ఖాయమన్నారు. కాబట్టి అభివృద్ధికి అవరోధంగా మారిన బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించాలని, తద్వారా ఢిల్లీలో చెత్తను తొలగించడానికి ఆమ్ఆద్మీ పార్టీకి అవకాశం కల్పించాలని కేజ్రివాల్ కోరారు.