ప్రధాని మోదీకి మమతా బెనర్జీ లేఖ
కోల్కతా, ఆగస్టు 7: ప్రజా వ్యతిరేక ‘విద్యుత్తు సంస్కరణల బిల్లు-2021’ను పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరసన తెలుపుతూ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న ఈ బిల్లును గత ఏడాదే పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రం విఫలయత్నం చేసిందని, బిల్లులోని లోపాలను తెలుపుతూ గతంలో తాను లేఖ రాసిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఇప్పుడు మరిన్ని ప్రజా వ్యతిరేక అంశాలతో ఆ బిల్లును తీసుకురావాలని కేంద్రం నిర్ణయించడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని తెలిపారు. ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసే ఈ బిల్లును ప్రవేశపెట్టవద్దని సూచించారు. భారత రాజ్యాంగం ప్రకారం విద్యుత్తు అంశం ఉమ్మడి జాబితాలో ఉన్నదని, ఆ జాబితాలోని అంశాలపై చట్టాన్ని చేసేప్పుడు ముందుగా రాష్ర్టాలను సంప్రదించాల్సి ఉంటుందన్నారు. కానీ దాన్ని కేంద్రం విస్మరించిందన్నారు.