పాటియాలా : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని, హంగ్ ఏర్పడే అవకాశం ఉంటుందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ జోస్యం చెప్పారు. గతేడాది కాంగ్రెస్కు రాజీనామా చేసిన అనంతరం ఆయన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. బీజేపీ, ఎస్ఏడీ (సంయుక్త్) పార్టీలతో కలిసి ఆయన పంజాబ్ ఎన్నికల్లో బరిలోకి దిగారు. సోమవారం ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో అలసిపోలేదన్నారు.
తాను పదవీ విరమణకు సిద్ధంగా లేనని, ప్రజల కోసం పని చేయాలనుకుంటున్నానన్నారు. పంజాబ్ను దేశంలోనే గొప్ప ప్రదేశంగా తీర్చిదిద్దాలనే తపన ఉందన్నారు. ఇది తనకు తొమ్మిదో ఎన్నిక అనీ.. రెండుసార్లు పార్లమెంట్కు, ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యాయని గుర్తు చేశారు. పంజాబ్ ఎన్నికల్లో చాలా చోట్ల ఈ సారి చతుర్ముఖ పోటీ, పలు చోట్ల ఐదుగురి మధ్య పోటీ ఉందని.. పలు చోట్ల స్వతంత్రులు సైతం పోటీలో ఉన్నారన్నారు.
అయితే, పార్టీల విషయానికి వస్తే.. వారి పనితీరులో మెరుగ్గా లేకపోతే వారికి కష్టమేనని.. ఎవరికి స్పష్టమైన మెజారిటీ రాబోదన్నారు. అయితే ప్రజలు ఆప్ గురించి మాట్లాడుతున్నారన్న ఆయన.. ఆ పార్టీ రోజు రోజుకు దిగజారిపోతుందని తాను భావిస్తున్నానన్నారు. చరణ్జిత్ సింగ్ చన్నీని సీఎం అభ్యర్థిగా.. కాంగ్రెస్ దళితుడని చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు కులానికి, వర్గానికి ఓటు వేయొద్దని.. సామర్థ్యానికి ఓటు వేయాలన్నారు.
తనకు కులాలు, వర్గాలపై ఇష్టం లేదని.. స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత ఇంకా కులంపై కాకుండా సామర్థ్యానికే ఓటు వేయాలన్నారు. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్లో ఈ నెల 20న పోలింగ్ జరుగనున్నది. ఎన్నికల్లో అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ బీజేపీ, ఎస్ఏడీ (సంయుక్త్) పార్టీలతో కలిసి పార్టీ చేస్తున్నది. బీజేపీ 65 స్థానాలు, పంజాబ్ లోక్ కాంగ్రెస్ 37 స్థానాలు, సుఖ్దేవ్ సింగ్ ధిండా నేతృత్వంలోని శిరోమణి అకాళీ దళ్ (సంయుక్త్) 15 స్థానాల్లో పోటీ చేయనున్నారు.