Covid | గడచిన 24 గంటల్లో కొత్తగా 1.75 లక్షల కోవిడ్ కేసులు నమోదయ్యాయని కోవిడ్ టాస్క్ఫోర్స్ సభ్యుడు డాక్టర్ నరేంద్ర కుమార్ అరోరా ప్రకటించారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం మాత్రం లేదని స్పష్టం చేశారు. ఈసారి మాత్రం ఆక్సిజన్ సిలిండర్ల కొరత గానీ, వెంటిలేటర్ల సమస్య గానీ, ఐసీయూ, బెడ్ల కొరత లాంటి సమస్యలేవీ లేవని స్పష్టం చేశారు. దేశంలో కరోనా తీవ్రత ఉందని, అయితే గతంతో పోలిస్తే తీవ్రత కాస్త తక్కువేనన్నారు. రెండు డోసులు తీసుకున్న వారికి కూడా కరోనా వస్తోందని, అయితే త్వరలోనే నయమవుతోందన్నారు. అందుకే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
గత సంవత్సరం దేశంలోని 80శాతం మంది ప్రజలు డెల్టా వెరియంట్తో ఏదో ఒక రూపంలో ఇబ్బందులు పడ్డారని, 85 శాతం మంది పిల్లలు కూడా ఇబ్బందులు పడ్డారని, అయితే త్వరలోనే కోలుకున్నారని నరేంద్ర కుమార్ అరోరా గుర్తు చేశారు. దేశంలో 86,08,12,039 మంది మొదటి డోసు తీసుకున్నారని, ఇక 63,19,98, 826 మంది సెకండ్ డోసు కూడా తీసుకున్నారని ఆయన తెలిపారు. ఇక దేశంలోని 2,29, 49280 మంది పిల్లలకు వ్యాక్సినేషన్ కొనసాగుతోందన్నారు. దేశంలోని చాలా మందికి వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతూ వస్తోందని, అందుకే కరోనా విషయంలో అంత భయాందోళనలు అవసరం లేదని అభిప్రాయపడ్డారు.