Dog | ముంబై : ఓ కుక్క పేలుడు పదార్థాలను కొరికింది. ఆ తర్వాత పేలుడు సంభవించడంతో కుక్క ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. థానే జిల్లాలోని షాహాపూర్ సమీపంలో ఓ ఫామ్ హౌజ్ ఉంది. అక్కడ ఓ రెండు కుక్కలు నివసిస్తున్నాయి. అయితే అందులో ఓ కుక్క బుధవారం రాత్రి ఆహార పదార్థాలు అనుకొని పేలుడు పదార్థాలను నోటితో పట్టుకొచ్చింది. ఆ తర్వాత దాన్ని కొరకగా పేలిపోయింది. ఆ కుక్క కూడా చనిపోయింది.
ఫామ్ హౌజ్ వద్ద ఉన్న వాచ్మెన్ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే బుధవారం రాత్రి కుక్క తన నోటితో ఏదో ఒక వస్తువును పట్టుకొచ్చిందని, దాన్ని కొరకగానే పేలిందన్నారు. దాంతో కుక్క కూడా చనిపోయిందని వాచ్మెన్ పోలీసులకు తెలిపాడు. అయితే అడవి జంతువులను వేటాడేందుకు కొందరు అక్కడక్కడ బాంబులను అమర్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.