చెన్నై : తమిళనాడులోని కృష్ణగిరిలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఆర్మీ జవాన్ను డీఎంకే పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ హత్య చేశాడు. ఈ ఘటనలో జవాన్ సోదరుడు గాయపడ్డాడు. నిందితుడు చిన్నస్వామిగా గుర్తించారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 8న చిన్నస్వామి ఇంటికి సమీపంలో వాటర్ ట్యాంక్ ఉన్నది. అక్కడ బట్టలు ఉతికే విషయంలో ఆర్మీ జవాన్ ప్రభాకర్ (33)తో వాగ్వాదం జరిగింది.
వాగ్వాదం జరిగిన రోజు రాత్రే చిన్నస్వామి తొమ్మిది మంది వ్యక్తులతో కలిసి ప్రభాకరన్ ఇంటికి చేరుకొని అతనితో పాటు సోదరుడు ప్రభుపై సైతం దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలకు గురైన అన్నాదమ్ముళ్లిద్దరిని ఆసుప్రతికి తరలించారు. ప్రభాకరన్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రస్తుతం ప్రభు చికిత్స పొందుతున్నారు. ప్రభు ఫిర్యాదు మేరకు కృష్ణగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నసామి కుమారుడు రాజపాండి సహా ఆరుగురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న చిన్నస్వామి కోసం గాలిస్తున్నారు.