న్యూఢిల్లీ, జనవరి 25: విమానంలో మీరు ఓ తరగతి టికెట్ బుక్ చేసుకొంటే.. మీ ప్రమేయం లేకుండానే సదరు విమానయాన సంస్థ దాన్ని దిగువ తరగతికి మార్చిందా? ఇకపై అలా చేస్తే విమానసంస్థలు ప్రయాణికులకు టికెట్ డబ్బు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని డీజీసీఏ కొత్త నిబంధనల్లో పేర్కొన్నది. దేశీయ విమాన టికెట్లను కింది తరగతికి మారిస్తే.. పన్నులతో సహా 75 శాతం టికెట్ రేటును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
అదే అంతర్జాతీయ విమాన సర్వీసుల టికెట్ విషయానికి వస్తే దూరాన్ని బట్టి టికెట్ ధరలో 30 నుంచి 75 శాతం వరకు రీయింబర్స్ చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి రానున్నాయని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు బుధవారం వెల్లడించారు. విమానసంస్థలు ఇష్టానుసారం తాము తీసుకొన్న టికెట్లను దిగువ తరగతికి మారుస్తున్నాయని ప్రయాణికుల నుంచి ఫిర్యాదుల నేపథ్యంలో ఈ మేరకు నిబంధనలు సడలించాలని డీజీసీఏ నిర్ణయం తీసుకొన్నది.