న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఇక నుంచి దేశభక్తి పాఠాలు భోదించనున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీ సెక్రెటేరియట్ నుంచి ప్రకటించారు. వచ్చే 27వ తేదీ నుంచి ఢిల్లీ బడుల్లో విద్యార్థులకు దేశభక్తి పాఠాల బోధన జరుగుతుందని తెలిపారు. సెప్టెంబర్ 27న స్వాతంత్ర్య సమరయోధుడు భగత్సింగ్ జయంతిని పురస్కరించుకుని ఆ రోజు నుంచి బడుల్లో దేశభక్తి పాఠాలు బోధించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఈ దేశభక్తి పాఠాల బోధన యాక్టివిటీ పద్ధతిలో ఉంటుందని, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందిస్తుందని కేజ్రివాల్ చెప్పారు. విద్యార్థులు దేశం గురించి కథలు కథలుగా చెప్పగలుగుతారని, దేశంపట్ల తమ బాధ్యతలు, విధులను గురించి చర్చించగులుగుతారని కేజ్రివాల్ తెలిపారు. ఈ దేశభక్తి పాఠాలను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ నుంచి తీసుకున్నట్లు వెల్లడించారు.
కాగా, గడిచిన ఏడు దశాబ్దాల్లో విద్యార్థులకు మిగిలిన అన్ని అంశాలను బోధిస్తూ వచ్చినా దేశభక్తి పాఠాలకు మాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. దాన్ని గుర్తించిన ఢిల్లీ సర్కారు ప్రతిరోజూ విద్యార్థులకు దేశభక్తి పాఠాలు భోధించాలని నిర్ణయించింది. ఇందుకోసం ముందుగా ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నేతృత్వంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.