రాయ్పూర్: చత్తీస్ఘడ్ లో బీజేపీ పార్టీ సర్కారును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 54 స్థానాల్లో విజయం సాధించింది. అయితే బీజేపీ హవాలో ఆ రాష్ట్రానికి చెందిన 9 మంది మంత్రులు పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ సర్కారులోని డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ డియో(Deputy CM Singh Deo) కూడా ఓటమి పాలయ్యారు. హోంమంత్రి తమ్రద్వాజ్ సాహూ కూడా ఓడిపోయారు. నిజానికి ఈ ఇద్దరు లీడర్లు.. 2018 ఎన్నికల్లో సీఎం అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. కానీ తాజా ఎన్నికల్లో మాత్రం డిప్యూటీ సీఎంకు ఓటర్లు జలక్ ఇచ్చారు. సింగ్ డియో కేవలం 94 ఓట్ల తేడాతో పరాజయం చవిచూశారు.
అంబికాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సింగ్ డియోకు 90,686 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి చెందిన రాజేశ్ అగర్వాల్కు 90780 ఓట్లు పోలయ్యాయి. వాస్తవానికి సింగ్ డియో.. చత్తీస్ఘడ్లో సంపన్న ఎమ్మెల్యే. ఆయన రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. ఈసారి సీఎం అయ్యే ఛాన్సు ఉన్న ఆయన.. అనూహ్య రీతిలో 94 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.
దుర్గ్ రూరల్ స్థానంలో నుంచి పోటీ చేసిన హోంమంత్రి సాహూ 16వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి లలిత్ చంద్రాకర్ చేతిలో ఓడిపోయారు. సజా స్థానం నుంచి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి రవీంద్ర చౌబే 5 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. శివకుమార్ దహరియా, గురు రుద్ర కుమార్, అమర్జీత్ భగత్, మోహన్ మార్కమ్, జై సింగ్ అగర్వాల్ లాంటి మంత్రులు కూడా ఓడిపోయారు. సీఎం భూపేశ్ భగేల్ విజయం సాధించారు. చత్తీస్ఘడ్ కాంగ్రెస్ చీఫ్ దీప్ బయిజ్.. చిత్రకూట్ స్థానం నుంచి ఓటమి చెందారు.