Dennis Francis : కోట్ల మంది ప్రజలను ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం చేయడంలో, పేదరిక నిర్మూలనలో భారత్ పనితీరు అద్భుతమని ‘ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA)’ అధ్యక్షుడు డెనిస్ ఫ్రాన్సిస్ కొనియాడారు. డిజిటలైజేషన్ను (Digitalisation) సమర్థంగా వినియోగించుకుంటోందని అన్నారు. ఫోన్ లాంటి ఒక డివైజ్, డిజిటలైజేషన్ మోడల్తోనే ఇది సాధ్యమవుతోందని పేర్కొన్నారు. ఉత్పాదకతను పెంచడం, ఖర్చును తగ్గించడం, ఆర్థిక వ్యవస్థను సమర్థంగా మార్చడంలో డిజిటలీకరణ తోడ్పాటును అందిస్తుందని అభిప్రాయపడ్డారు.
ఈ ఏడాది జనవరి 22 నుంచి 26 మధ్య ఫ్రాన్సిస్ భారత్లో పర్యటించారు. విదేశాంగ మంత్రి జైశంకర్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. జైపుర్, ముంబైలో పర్యటించిన డెనిస్. పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, మేధోసంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పరిశీలించిన అంశాలను ఆధారం చేసుకొని డిజిటలైజేషన్ వినియోగంతో భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రశంసించారు. మహిళలు, రైతులు సహా ప్రతి ఒక్కరూ తామున్న చోటు నుంచే చెల్లింపులు చేస్తున్నట్లు గుర్తించామని ఆయన చెప్పారు. అందుకే ప్రపంచ వేదికపై భారత పోటీతత్వం పెరుగుతోందని కొనియాడారు.
అంతేగాక దేశవ్యాప్తంగా మౌలిక వసతుల సదుపాయాల్లోనూ భారత్ గణనీయంగా పెట్టుబడులు పెడుతున్నట్లు గమనించామని ఫ్రాన్సిస్ తెలిపారు. దీంతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, కార్మికులకు నిరంతరం పని లభిస్తుందని అన్నారు. వివిధ వస్తువులకు గిరాకీ పుంజుకుంటుందని, తద్వారా ఆర్థిక వ్యవస్థ గణనీయ వృద్ధి నమోదు చేస్తుందని చెప్పారు. అయితే మౌలిక వసతుల అభివృద్ధిని పర్యావరణ అనుకూల విధానాలతో ముడిపెట్టాలని సూచించారు. లేకపోతే భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిణమిస్తుందని హెచ్చరించారు.