న్యూఢిల్లీ : కరోనా డెల్టా వేరియంట్ ప్రభావం ఇంకా దేశంలో ఉందని ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ బలరామ్ భార్గవ అన్నారు. శుక్రవారం ఆయన కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ సెక్రెటరీ రాజేశ్ భూషన్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల గుర్తించిన వైరస్లతో సహా డెల్టా ప్రభావం భారత్లో ఇంకా ఎక్కువగానే ఉందన్నారు. అందరు కొవిడ్ ప్రవర్తనా నియమావళిని పాటించడం, వ్యాక్సినేషన్ పెంచాలన్నారు.
దేశంలో 358 ఒమిక్రాన్ కేసులు
దేశంలోని 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 358 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయని హెల్త్ సెక్రెటరీ రాజేశ్ భూషన్ తెలిపారు. ఇందులో 114 మంది కోలుకున్నారన్నారు. 183 ఒమిక్రాన్ కేసులను విశ్లేషించగా.. 121 మంది విదేశాలకు వెళ్లారని, 44 మంది విదేశాలకు వెళ్లలేదన్నారు. అయితే చాలా మంది పరిచయస్తులు విదేశాలకు వెళ్లారన్నారు. 183 మందిలో 87 మంది కొవిడ్ రెండు డోసులను తీసుకున్నారన్నారు. డెల్టా కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తిచెందుతందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిందని, దీని కేసులు 5-3 రోజుల్లో రెట్టింపవుతాయని చెప్పిందని.. ఈ క్రమంలో అంతా జాగ్రత్తగా ఉండాలన్నారు.
89శాతం మందికి మొదటి డోసు టీకా
దేశంలో అర్హత ఉన్న వయోజన జనాభాలో 89శాతం మంది మొదటి టీకాను, 61శాతం మంది రెండో డోసు టీకా తీసుకున్నారన్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ, రద్దీని నియంత్రించడం వంటి ఆంక్షలు విధించాలని ఇప్పటికే రాష్ట్రాలకు సూచించామన్నారు. ఈ రోజుకు 18,10,083 ఐసోలేషన్ పడకలు.. 4,94,314 ఆక్సిజన్ సపోర్ట్ బెడ్లు.. 1,39,300 ఐసీయూ బెడ్లు, 24,057 పీడియాట్రిక్ ఐసీయూ బెడ్లు.. 64,796 పీడియాట్రిక్ నాన్ ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు.