న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని రమ్జాస్ కాలేజీ విద్యార్థులు అద్భుత ఆవిష్కరణ చేశారు. విత్తనాలు కలిగిన బయోడీగ్రేడెబుల్ వంట పాత్రలను అభివృద్ధి చేశారు. ఆ పాత్రలు భూమిలో కలిస్తే, అందులో ఉండే విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా పెరుగుతాయి. వీటి వల్ల కాలుష్యం, నిరుద్యోగ సమస్యలను సమర్థంగా అరికట్టొచ్చని విద్యార్థులు విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ పాత్రల్లో ఆహారాన్ని వడ్డించిన తర్వాత వీటిని మట్టిలో పాతిపెడితే మొలకెత్తుతాయి. దీని వల్ల వ్యర్థాల కాల్చివేతను, పేపర్, ప్లాస్టిక్ ప్లేట్ల వ్యర్థాలను, నిరంతర అడవుల క్షీణతను అరికట్టవచ్చని విద్యార్థుల బృందం తెలిపింది. పర్యావరణహితమైన వ్యాపారాలను ప్రోత్సహించే ఎనక్టస్ అనే లాభాపేక్ష రహిత సంస్థలో ఈ విద్యార్థుల బృందం కీలక భాగస్వామిగా ఉన్నది. ప్రాథమిక (పైలట్) దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్కు ‘వరఖ్’ అని పేరు పెట్టారు.