న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీలో 2 లక్షలకుపైగా విద్యార్థులు ఉండగా, కేవలం 9 వేల మందికి మాత్రమే హాస్టల్ పడకలు అందుబాటులో ఉన్నాయి. సోమవారం సత్యనికేతన్లో భవనం కూలి, ఏడుగురు మృతిచెందిన ఘటన తర్వాత.. ఇంతమంది విద్యార్థులు ఎందుకు సురక్షితం కాని పీజీల్లో ఉండాల్సి వస్తున్నదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రతి ఏటా 50 వేలకుపైగా విద్యార్థులు ఢిల్లీ యూనివర్సిటీలో చేరుతున్నారు. వీరిలో అత్యధికశాతం విద్యార్థులు ఢిల్లీ వెలుపలి ప్రాంతాల నుంచి వస్తుంటారు. డీయూ మొత్తంగా 18 హాస్టళ్లను నిర్వహిస్తుండగా, దాని పరిధిలో కేవలం 9 కాలేజీల్లోనే క్యాంపస్ హాస్టల్ సదుపాయాలున్నాయి.
డీయూ వెబ్సైట్ ప్రకారం కేవలం యూనివర్సిటీ నిర్వహించే హాస్టళ్లు మూడు మాత్రమే ఉన్నాయి. యువతుల కోసం గీతాంజలి హాస్టల్, యువకుల కోసం సరమతి హాస్టల్, ఆరావళి పీజీ హాస్టల్ అందుబాటులో ఉన్నాయి. యూనివర్సిటీ లేదా కాలేజీ హాస్టల్లో సీటు లభించని విద్యార్థులకు పేయింగ్ గెస్ట్(పీజీ) వసతిని ఎంచుకోవడమే ప్రత్యామ్నాయంగా ఉంది. దీంతో సౌత్ క్యాంపస్ చుట్టుపక్కల ప్రాంతాలైన సత్యనికేతన్, మోతీ బాగ్, ఆనంద్ నికేతన్, మునిర్కా ప్రాంతాల్లో పీజీ వసతులు భారీగా పెరిగాయి. ఒక గదికి నెలకు రూ. 8,000 నుంచి 12,000 వరకూ అద్దె ఉంటున్నది.