న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితంగానే ఇవ్వనున్నట్లు సోమవారం ఆయన తెలిపారు. మొత్తం 1.34 కోట్ల వ్యాక్సిన్ల కొనుగోలు కోసం అనుమతి ఇచ్చాము. సాధ్యమైనంత త్వరగా వాటిని కొనుగోలు చేసి ప్రజలకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాము అని కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే ఇది కేవలం ప్రభుత్వ ఆసుపత్రులకే పరిమితయ్యే అవకాశం ఉంది. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే వాళ్లు డబ్బులు చెల్లించాల్సి రావచ్చు.
ఇక రాష్ట్రాలకు ఇచ్చే వ్యాక్సిన్ల ధరలను తగ్గించాలని కేజ్రీవాల్ తయారీదారులను కోరారు. డోసు రూ.150కే ఇవ్వాలని నేను కోరుతున్నాను. మీరు లాభాలు ఆర్జించడానికి మొత్తం జీవితకాలం ఉంది. కానీ ఇప్పుడు కరోనా విరుచుకుపడిన సమయంలో ఇలా చేయడం సరి కాదు. వ్యాక్సిన్ల ధరలపై పరిమితి విధించాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను అని కేజ్రీవాల్ అన్నారు.
ఒకరు రాష్ట్రాలకు రూ.400కు ఇస్తామని, మరొకరు రూ.600కు ఇస్తామన్నారు. కేంద్రానికి మాత్రం రూ.150 కే ఇస్తామంటున్నారు. అందరికీ ఒకే ధర ఉండాలి అని కేజ్రీవాల్ కోరారు. అయితే కేంద్రం మాత్రం ఇప్పటికే తయారీదారుల నుంచి రూ.150కి కొని వాటిని రాష్ట్రాలకు ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది.