Delhi Politics | ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యే మంత్రులుగా ప్రమాణం చేశారు. సౌరభ్ భరద్వాజ్తో పాటు అతిషితో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణం చేయించారు. ఆ తర్వాత ఇద్దరికి శాఖలను సైతం కేటాయించారు. అతిషి విద్యశాఖ, పబ్లిక్ వర్క్స్తో పాటు టూరిజంశాఖల బాధ్యతలను అప్పగించారు. సౌరభ్ భరద్వాజ్కు ఆరోగ్యం, పరిశ్రమలశాఖలను కేటాయించారు.
సౌరభ్ భరద్వాజ్ గ్రేటర్ కైలాశ్ నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇంతకు ముందు కేజ్రీవాల్ ప్రభుత్వంలోనూ ఆయన తొలిసారిగా మంత్రిగా పని చేశారు. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. పార్టీలో కీలక బాధ్యతల్లో కొనసాగుతున్నారు. మూడోసారి ఎమ్మెల్యే ఎన్నికైన అనంతరం రాఘవ్ చద్దా రాజ్యసభ సభ్యుడిగా నియమించిన తర్వాత ఢిల్లీ జల్ బోర్డుకు వైస్ చైర్మన్గా పని చేశారు. ఆయన పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. అన్నా హజారే ఉద్యమంలోనూ పాల్గొన్నారు.
కేజ్రీవాల్ ప్రభుత్వంలో అతిషి తొలిసారిగా బాధ్యతలు చేపట్టింది. కల్కాజీ అసెంబ్లీ నుంచి అతిషి గెలుపొందింది. అతిషి చాలా కాలంగా కేజ్రీవాల్ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సలహాదారుగా పని చేశారు. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో మార్పుల వెనుక అతిషి కీలకపాత్ర పోషించింది. అతిషి సూచన మేరకు విద్యారంగంలో ప్రభుత్వం అనేక మార్పులు తీసుకువచ్చింది. అతిషి రాజకీయాల్లోకి రాకముందు ఉపాధ్యాయురాలిగా పని చేశారు.
1981లో జన్మించిన అతిషి.. ఢిల్లీలోని స్ప్రింగ్డేల్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. రోడ్స్ స్కాలర్షిప్ పొంది ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు. రాజకీయాల్లోకి రాకముందు అతిషి ఆంధ్రప్రదేశ్లోని రిషి వ్యాలీ స్కూల్లో చరిత్ర బోధించారు. అనేక స్వచ్ఛంద సంస్థలతో కూడా పనిచేశారు. అన్నా ఉద్యమ సమయంలో కేజ్రీవాల్తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆప్ పార్టీలో చేరారు.