న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మేయర్ ఎన్నిక ఈ నెల 6న జరుగనున్నది. దీని కోసం సభ్యుల సమావేశానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అంగీకరించారు. ఫిబ్రవరి 3,4,6 తేదీలను ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం సూచించగా ఆరో తేదీని ఖరారు చేశారు. మరోవైపు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), పీఠం నుంచి దిగిన బీజేపీ మధ్య పోరు కొనసాగుతున్నది. దీని వల్ల మేయర్ ఎన్నిక రెండుసార్లు ఆగిపోయింది. జనవరి 6, 24 తేదీల్లో మేయర్ ఎన్నిక కోసం సభ్యులు సమావేశమయ్యారు. అయితే ఎంసీడీ ఎన్నికల్లో ఓడిన బీజేపీ కూడా మేయర్ పీఠం కోసం కుయుక్తులు పన్నింది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల సభ్యుల మధ్య ఘర్షణ జరుగడంతో మేయర్ ఎన్నిక రెండుసార్లు నిలిచిపోయింది.
ఈ పరిణామాల నేపథ్యంలో మేయర్ ఎన్నికను త్వరగా నిర్వహించాలని కోరుతూ ఆప్ మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ గత గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఎంసీడీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో ఆప్ గెలిచినప్పటికీ మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ చూస్తున్నదని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా దీనికి సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు.