న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నుంచి మెల్లగా బయటపడుతున్న ఢిల్లీలో అన్లాక్ ప్రక్రియను ప్రారంభించారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. దీనికి సంబంధించి శనివారం ప్రకటన చేశారు. దీనికోసం ఢిల్లీలో కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ఉపయోగించిన విధానాన్నే ఫాలో అవుతున్నారు. మార్కెట్లు, మాల్స్ను సరి, భేసి విధానంలో తెరుచుకోవచ్చని ఆయన చెప్పారు. ఇవి కాకుండా సాధారణ దుకాణాలను మాత్రం ప్రతి రోజూ తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చారు. వచ్చే సోమవారం నుంచి ఈ అన్లాక్ ప్రారంభమవుతుంది.
సరి, భేసి విధానం ప్రకారం.. సగం షాపులు ఒకరోజు, మిగతా సగం షాపులు మరో రోజు తెరవాల్సి ఉంటుంది. అత్యవసర వస్తువుల దుకాణాలు, మెడికల్ షాపులు మాత్రం ప్రతి రోజూ తెరవచ్చు. ఇక ప్రైవేటు కార్యాలయాలు 50 శాతం సామర్థ్యంతో పని చేయాలి. ఇంటి నుంచి పని చేసే వీలుంటే అలాగే కొనసాగాలని ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ కోరారు. పబ్లిక్ సెక్టార్ ఆఫీసుల్లో కేటగిరీ ఎ ఉద్యోగులు ప్రతి రోజూ పని చేయాల్సి ఉంటుంది. వారి కింది ఉద్యోగుల్లో మాత్రం 50 శాతమే హాజరు కావాలి.
ఇక ఢిల్లీ మెట్రో కూడా 50 శాతం సామర్థ్యంతో నడపాలని నిర్ణయించారు. పరిస్థితులు మెరుగుపడిన కొద్దీ మరిన్ని సడలింపులు ఉంటాయని కేజ్రీవాల్ ప్రకటించారు. ఇక మూడో వేవ్కు ఇప్పటి నుంచే తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.