న్యూఢిల్లీ: రోజురోజుకు సమాజంలో సహనం నశిస్తున్నది. చిన్నచిన్న విషయాలకే గొడవలుపడి పోలీస్ స్టేషన్ల దాకా వెళ్తున్నారు. కొన్ని సందర్భాల్లోనైతే ఇలాంటి గొడవలు ప్రాణాల మీదకే వస్తున్నాయి. తాజాగా పశ్చిమ ఢిల్లీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ఏరియాలో ఓ 50 ఏండ్ల వ్యక్తి తన కుక్కను తీసుకుని వాకింగ్ చేస్తున్నాడు.
ఈ క్రమంలో పొరుగు వ్యక్తి కమల్ ఇంటిముందు కుక్క మూత్రం పోసింది. బిల్డింగ్ పైనుంచి ఇది గమనించిన కమల్ కుక్క యజమానితో గొడవకు దిగాడు. కమల్ కొడుకులిద్దరు కూడా కిందకు వచ్చి గొడవపడుతున్నారు. ఈ క్రమంలో కమల్ టాయిలెట్స్ కడిగే యాసిడ్ తెచ్చి మొదటి అంతస్తు నుంచి కుక్క యజమానిపై గుప్పాడు.
ఈ ఘటనలో కుక్క యజమానికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కమల్ను, అతని కొడుకులు రోహిత్, హిమాన్షును అదుపులోకి తీసుకున్నారు. కమల్ ఇంటి నుంచి టాయిలెట్స్ కడిగే యాసిడ్ బాటిల్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.