న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి జూహీ చావ్లాకు షాకిచ్చింది ఢిల్లీ హైకోర్టు. 5జీ వైర్లెస్ నెట్వర్క్కు సంబంధించి ఇండియాలో ట్రయల్స్ను వ్యతిరేకిస్తూ ఆమె వేసిన పిటిషన్ను శుక్రవారం కొట్టేసింది. అంతేకాదు ఆమెకు రూ.20 లక్షల జరిమానా కూడా విధించింది. ఆమె న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేసిందని కోర్టు తీర్పు స్పష్టం చేసింది. ఈ దావా కేవలం పబ్లిసిటీ కోసం వేసినట్లుగా ఉన్నదని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం.
కోర్టు విచారణకు సంబంధించిన లింకును జూహీ.. సోషల్ మీడియాలో వ్యాప్తి చేసిందని, దీనివల్ల మూడుసార్లు విచారణకు అడ్డంకులు ఎదురయ్యాయని కోర్టు చెప్పింది. ఇక విచారణ సందర్భంగా అడ్డంకులు సృష్టించిన వ్యక్తులను పట్టుకొని, తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను కోర్టు ఆదేశించింది.