న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం జర్నలిస్టులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులందరికీ ఇది వర్తించనుంది. పైగా వాళ్లందరికీ వాళ్ల ఆఫీసుల్లోనే వ్యాక్సిన్ వేయనుండటం గమనార్హం. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు కొవిడ్ పరిస్థితిపై అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎంతోపాటు ఆరోగ్య మంత్రి, ఆరోగ్యశాఖ కార్యదర్శి, అన్ని జిల్లాల డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్లు హాజరయ్యారు. మరోవైపు ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 19832 కేసులు, 341 మరణాలు సంభవించాయి.