న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేయడంతో పాటు నూతన సంవత్సరం సందర్భంగా ఆంక్షలు అమలులోకి తీసుకువచ్చింది. నూతన సంవత్సరం తొలి రోజున మార్గదర్శకాలు పాటించని వారిపై అధికారులు కొరడా ఝుళిపించారు. ఒకే రోజు రూ.కోటి జరిమానాలు విధించడంతో పాటు 66 కేసులు నమోదు చేశారు.
ఓ వైపు కేసులు రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నా.. ఎవరూ తీవ్రంగా తీసుకోవడం లేదు.. మాస్క్ ధరించాలని ప్రభుత్వం, అధికారులు ఎంత మొత్తుకుంటున్నా పలువురు మాస్క్ ధరించకుండా జనంలో తిరుగుతూనే ఉన్నారు. శనివారం ఢిల్లీలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హోటళ్లు, పబ్బులు, రెస్టారెంట్లు, మార్కెట్లలో జనం భారీగా తరలివచ్చారు. ఈ సమయంలో, ఫేస్ మాస్క్ సరిగ్గా ధరించనందున 4,878 మందికి జరిమానా విధించారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తున్న 15 మందికి సైతం ఫైన్ వేశారు. ఈ సందర్భంగా 66 మందిపై చట్టపరంగా కేసులు నమోదు చేశారు.
ఆయా కేసుల్లో మొత్తం రూ.99.34 లక్షల జరిమానా విధించినట్లు అధికారులు పేర్కొన్నారు. డిసెంబర్ 28 నుంచి ఇప్పటి వరకు ఢిల్లీ వాసులు రూ.10కోట్లు పెనాల్టీ రూపేణా చెల్లించగా.. 300 మందికిపై కేసులు నమోదయ్యాయి. 1న రాత్రి 10 గంటల నుంచి 2న తేదీ ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించగా.. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఢిల్లీ పోలీసులు 228 మందిపై కేసు నమోదు చేయగా, 637 మందికి చలానా విధించారు.