న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విద్యుత్ రాయితీ పథకంపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెనక్కి తగ్గారు. అక్టోబర్ 1 నుంచి విద్యుత్ రాయితీ ఐచ్ఛికమని తెలిపారు. కోరుకున్న వారికి మాత్రమే విద్యుత్పై రాయితీ ఇస్తామని గురువారం ప్రకటించారు. ‘ప్రజలకు ఉచితంగా విద్యుత్, రాయితీ కావాలా వద్దా అనే దానిని ఎంచుకునే అవకాశం ఇస్తాం. ఉచిత విద్యుత్, రాయితీ కోరుకునే వినియోగదారులకు ఆ మేరకు విద్యుత్ను సరఫరా చేస్తాం’ అని మీడియా సమావేశంలో అన్నారు. విద్యుత్ బిల్లులు చెల్లించే సామర్థ్యం ఉన్నవారు ఉచిత విద్యుత్ పథకంతోపాటు విద్యుత్ రాయితీని వదులుకోవాలని పరోక్షంగా సూచించారు. పూర్తిగా విద్యుత్ బిల్లులు చెల్లిస్తారా లేదా 200 యూనిట్లు ఉచితంగా వినియోగించుకుంటారా అన్నదానిని ప్రజలు ఎంచుకునే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు.
కాగా, ప్రస్తుతం ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం నెలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ను ఇస్తోంది. దీంతో 200 యూనిట్ల విద్యుత్ వినియోగదారులకు ‘జీరో బిల్లు’ వస్తున్నది. అలాగే 201-400 యూనిట్ల వినియోగంపై నెలకు రూ.800 రాయితీ ఇస్తున్నది. 2015 ఎన్నికల సందర్భంగా ఉచిత విద్యుత్, ఉచిత తాగు నీటి పథకాలపై అరవింద్ క్రేజీవాల్ హామీ ఇచ్చారు. అయితే ఉచిత విద్యుత్, విద్యుత్పై రాయితీ పథకం అమలు కోసం 2022-23లో కేజ్రీవాల్ ప్రభుత్వం రూ.3,340 కోట్ల నిధులు బడ్జెట్లో కేటాయించింది.
మరోవైపు వేసవి కాలం నేపథ్యంలో ఢిల్లీతోపాటు దేశ వ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరిగింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తగ్గి ఉత్పత్తిపై ప్రభావం పడింది. దీంతో ఢిల్లీతోపాటు పలు రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని మెట్రో రైళ్లతోపాటు ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రభావం చూపింది.